(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఢిల్లీ, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బంధం ముణ్నాళ్ల ముచ్చటగానే మారేటట్టు ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య బుధవారం జరిగిన పరిణామాలు ఈ కూటమిలో చిచ్చు రేపాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ కూటమి పక్షాల మధ్య అవగాహన ఉండాలని, సీట్ల సర్దుబాటు చేసుకోవాలని పాట్నా, బెంగళూర్లో జరిగిన సమావేశాలలో ప్రాథమికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాల పట్ల మిత్ర ద్రోహానికి తెరలేపుతూ ఢిల్లీలో అన్ని లోక్సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ఆప్ తీవ్రంగా మండిపడింది. అన్నింట్లో కాంగ్రెస్ పోటీ చేసేటట్టు అయితే విపక్షాల కూటమి ఎందుకని ఆప్ ప్రశ్నించింది. దీంతో ముంబైలో జరగనున్న ఇండియా కూటమి భేటీకి తమ పార్టీ హాజరు కావాలో? లేదో పునరాలోచిస్తామని ఆప్ హెచ్చరించింది.
వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీ కాంగ్రెస్ నేతలు బుధవారం సమావేశమయ్యారు. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిందిగా పార్టీ అగ్రనేతలు ఆదేశించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా మీడియాకు తెలిపారు. ఢిల్లీలోని అన్ని లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. దీనిపై ఆప్ నేత ప్రియాంక కక్కర్ తీవ్రంగా స్పందించారు. కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వాములని, అలాంటప్పుడు ఎన్నికల్లో పోటీపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆమె మండిపడ్డారు. ఇలా ఎవరికివారే ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతిపక్షాల కూటమికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. త్వరలో ముంబైలో జరుగనున్న ప్రతిపక్షాల కూటమి సమావేశం కూడా దండగని విమర్శించారు.
ఎన్సీపీ కూడా ఇండియా కూటమిలో కొనసాగుతుందా? లేదా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం ఇప్పటికే మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది. ప్రతిఫలంగా అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మున్ముందు సీఎం షిండేను తప్పించి అజిత్కు సీఎం సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ తనతో పాటు ఎన్డీయే వైపు శరద్ పవార్ను కూడా తీసుకెళ్లడానికి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఎన్డీయేలో చేరితే శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియాసూలేకి మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఎర వేసినట్టు సమాచారం. ఈ నేపథ్యలో ముంబై సమావేశానికి పవార్ వర్గం వెళ్లటం అనుమానమేనని అంటున్నారు.