Bakka Judson | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పొందినవారిని చూస్తే పార్టీ గెలిచేది కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని గతంలో తిట్టినవారికి టికెట్లు ఇస్తే కార్యకర్తలు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బక్క జడ్సన్ మాట్లాడుతూ.. ఎంపీ టికెట్ల కేటాయింపు, సీఎం రేవంత్రెడ్డి వైఖరి చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలుగబోతున్నదని హెచ్చరించారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి పార్టీలో అభ్యర్థులే లేరా? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. మల్కాజిగిరి, చేవెళ్ల అభ్యర్థులు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేరని అభిప్రాయపడ్డారు.
మల్కాజిగిరి అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్రెడ్డికి టెకెట్ ఇవ్వబోతున్నట్టు తెలిసిందని, నిన్న మొన్న పార్టీలో చేరిన ఆయన ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. మహబూబ్నగర్లో వంశీచందర్రెడ్డికి స్థానిక నాయకులు సహకరించడం లేదని చెప్పారు. ఒక టీవీ చానల్లో రాహుల్గాంధీని నానా దుర్భాషలాడిన చామల కిరణ్కుమార్రెడ్డికి భువనగిరి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనడం తప్పుకాదా? అని ప్రశ్నించారు. ముప్పై ఏండ్ల నుంచి పార్టీలో ఉన్న తనను కొత్తగా పార్టీలోకి వచ్చి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు లాంటివారు కనీసం గుర్తుపడతారా? అని ప్రశ్నించారు.