హైదరాబాద్: గతంలో 60 ఏండ్ల పాలనలో తమ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తమ శ్వేతపత్రంలో పేర్కొనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం కాంగ్రెస్ అంత ఖర్చు చేసి ఉంటే.. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చే నాటికి అంత దుస్థితి ఎందుకు ఉండేదని ఆయన ప్రశ్నించారు. 1956లో జరిగిన ఒప్పందానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేసిందని, తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అబద్ధం చెప్పిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనపై బురదజల్లడానికి శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ లేవనెత్తిన అంశాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టడానికి, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు తెలియజెప్పడానికే తాము శ్వేదపత్రం విడుదల చేశామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని చెప్పడానికి కొత్త ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి, వాళ్లు చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు అని నిరూపించడానికి తాము ఈ ప్రయత్నం చేశామన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘మా పార్టీ కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన పార్టీ మాత్రమే కాదు. తెలంగాణ అనే పదానికే అస్థిత్వం తెచ్చి పెట్టిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ తమ 60 ఏండ్ల పాలనలో చేసిన ఖర్చును గంపగుత్తగా వాళ్ల శ్వేతపత్రంలో చూపించింది. వారి 60 ఏండ్ల పాలనలో తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్ల ఖర్చు చేశామని, అది బడ్జెట్లో 48.68 శాతమని పేర్కొంది. కానీ, వాస్తవానికి జరిగింది ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేశారు’ అని గుర్తుచేశారు.
‘1956లో ఒప్పందం ప్రకారం.. తెలంగాణలోని ఆదాయాన్ని తెలంగాణలోనే ఖర్చు చేయాలి. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు. దాంతో తెలంగాణలో ఉద్యమం జరిగింది. తెలంగాణవాదుల ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి రెండు కమిటీలు వేసింది. ప్రభుత్వం నియమించిన జస్టిస్ లలిత్కుమార్ కమిటీ, జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ రెండు కూడా తెలంగాణ ఆదాయాన్ని అంధ్రాలో వినియోగించారన్న సంగతి నిజమేనని తేల్చాయి. కాబట్టి తెలంగాణలో రూ.4.98 లక్షల ఖర్చు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండటం శుద్ధ అబద్ధం. నిజంగా అంత ఖర్చు చేసి ఉంటే తెలంగాణలో పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది..? తెలంగాణ బిడ్డలు అంతమంది ఎందుకు ప్రాణాలు కోల్పోయేవాళ్లు..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘ఇంకా విచిత్రం ఏమిటంటే.. 60 ఏండ్లలో మేం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసినమని వాళ్లే చెప్తరు. అదే శ్వేతపత్రంలో కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 10 ఏండ్లలో చేసిన ఖర్చు 13,72,930 కోట్లు అని వాళ్లే చెప్తరు. అదే నిజమైతే వాళ్లు 60 ఏండ్లలో చేసిన ఖర్చుకు దాదాపు మూడింతల ఖర్చు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసింది. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని వాళ్లు అంటరు. కాంగ్రెస్ సర్కారు తప్పుడు లెక్కలు చెప్పిందనడానికి ఇది రుజువు కాదా..? బీఆర్ఎస్పై బురదజల్లడమే వాళ్ల లక్ష్యమని అర్థం కావడం లేదా..?’ అని కేటీఆర్ అన్నారు.