MLC Kavita : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇకనైనా నిజాలు మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కాంగ్రెస్ తాము ఇన్నాళ్లు చెప్పినవి అబద్ధాలు అని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని అన్నారు. శాసనమండలిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని అన్నారు.
రాష్ట్రం అప్పులు మొత్తం రూ.4.42 లక్షలుగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని,
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పులున్నాయని దష్ప్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని అన్నారు. అబద్దాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని సూచించారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్నదానిలో వాస్తవం లేదని, స్వయంగా ఇరిగేషన్ మంత్రి మండలిలో ఈ విషయం చెప్పారని అన్నారు.
‘నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా..?’ అని కవిత ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని చెప్పారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతుందని ఆమె తెలిపారు. మహాకుంభమేళా తరహాలో సభను నిర్వహిస్తామని అన్నారు. ఇరవై ఐదు వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కవిత పిలుపునిచ్చారు. శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రజల గొంతుకగా వ్యవహరించిందని అన్నారు.
సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని కవిత చెప్పారు. ప్రజలు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల సమస్యలపై గళమెత్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతి రోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపామని గుర్తుచేశారు. కేసీఆర్పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపామని అన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్పై తాము చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చిందని, ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. ప్రకటించిన విధంగా సీఎం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేసేవరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత అన్నారు. ఈ మండలి సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని, ఈ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని తెలిపారు.
ఆ బిల్లుల ఆమోదానికి బీఆర్ఎస్ పార్టీ కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్ధేశించి పరుష పదజాలంతో ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలు ఆయన చరిత్రలో మరకగా ఉండిపోతాయని అన్నారు.