హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్లో వర్గపోరు మరింత రాజుకొంటున్నది. ఇప్పటికే సీనియర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోగా, స్థానిక నేతలు ఎవరికి వారే అన్నట్టు మారింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే-హాథ్ జోడో యాత్ర అనుకొన్నంత సక్సెస్ కాకపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఉమ్మడిగా కలిసి చేయాల్సిన యాత్ర ఎవరికి వారు వేర్వేరు పేర్లతో నిర్వహిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్రెడ్డి ‘యాత్ర ఫర్ చేంజ్’ పేరుతో దీన్ని ప్రారంభించగా ‘కాంగ్రెస్ పోరు యాత్ర’ పేరుతో ఏలేటి మహేశ్వర్రెడ్డి కొనసాగిస్తున్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క ఎవరికి వారే తమ సొంత యాత్ర చేపట్టబోతున్నారు.
రేవంత్ షోకు సీనియర్ల చెక్
రాహుల్గాంధీ యాత్ర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్రెడ్డి నిర్ణయించుకొన్నారు. అప్పటికే ఆయన వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్లు, అసంతృప్త నేతలు రేవంత్ ప్లాన్కు చెక్ పెట్టారు. ఆయన పాదయాత్రను వ్యతిరేకించారు. తమ పరిధిలోని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆయన పెత్తనం చెలాయించడమేంటని ప్రశ్నించారు. తమ ప్రాంతాల్లో తామే యాత్ర చేసుకొంటామని స్పష్టం చేశారు.
రేవంత్ను రానిచ్చేది లేదు
పార్టీలోని సీనియర్లంతా రేవంత్రెడ్డి బాధితులుగా మారిపోయారు. మొన్న పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహంగా ఉన్నారు. పాదయాత్ర ద్వారా తమ ప్రాంతాల్లో తమను మరింత బలహీనులుగా చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి పాదయాత్రను తమ జిల్లాల్లోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలోకి రేవంత్ను రాకుండా అసంతృప్త వర్గం నేత దొంతి మాధవరెడ్డి అడ్డుకొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోకి రావొద్దని ఏలేటి మహేశ్వర్రెడ్డి, నల్లగొండలోకి రావొద్దని ఉత్తమ్, వెంకట్రెడ్డి, ఖమ్మంలోకి రావొద్దని భట్టి విక్రమార్క ఇప్పటికే తేల్చిచెప్పారు. వీరంతా తమ సొంత యాత్ర చేపట్టారు. అసంతృప్త నేతలు అడ్డుకొంటుండటంతో చేసేది లేక రేవంత్ తన పాదయాత్ర రూట్ మ్యాప్ను మార్చుకొంటున్నారు. నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించాల్సిన యాత్ర కరీంనగర్ జిల్లాకు మారింది.