హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల ప్రకటన రగిల్చిన చిచ్చు రచ్చకెక్కింది. కమిటీల కూర్పుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పలువురు సీనియర్ నేతలు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నివాసంలో శనివారం సమావేశమై అధిష్ఠానం వద్దే తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. సమావేశానికి ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి, ప్రేమ్సాగర్రావు, మధుయాష్కీ తదితరులు హాజరయ్యారు. కమిటీల వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించనున్న పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు కూడా వెళ్లకూడదని నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం ఏలేటి మహేశ్వర్రెడ్డి నివాసంలో, ఈ నెల 20న భట్టి నివాసంలో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాలని నిర్ణయించారు. పీసీసీ చీఫ్ నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని సీనియర్లు నిర్ణయించిన నేపథ్యంలో అధిష్ఠానం రంగంలోకి దిగింది. సమస్య పరిష్కారం కోసం ఢిల్లీకి రావాలని సీనియర్ నేతలను ఆదేశించింది. అధిష్ఠానం నుంచే పిలుపు రావడంతో రేవంత్రెడ్డి తీరుపై తాడోపేడో తేల్చుకొనేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. వాస్తవ పరిస్థితులను ముక్తకంఠంతో అధిష్ఠానానికి వినిపించాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పీసీసీ కమిటీల కూర్పులో తాను పాలుపంచుకోలేదని, ఈ విషయంతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న నాయకులపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఏదో కుట్ర ఉన్నదన్న భావన కలుగుతున్నదని పేర్కొన్నారు. కొందరు బలమైన నేతలు ఉద్దేశపూర్వకంగానే పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలనే అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. నేతల అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
నాలుగు పార్టీలు మారిన వాళ్లతో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఎద్దేవా చేశారు. కమిటీల్లోకి తీసుకున్న 108 మందిలో సగానికి పైగా టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, కోవర్టులుగా చిత్రీకరిస్తున్నారని, తన ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి.. కొంతమంది అసత్యప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వార్రూం నుంచే ఇదంతా నడుస్తున్నదని, ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ను కాపాడుకోవడమే లక్ష్యంగా అధిష్ఠానాన్ని కలుస్తామని స్పష్టంచేశారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తాము నాలుగు పార్టీలు మారి వచ్చినవాళ్లం కాదని, కాంగ్రెస్లోనే ఉంటాం.. కాంగ్రెస్లోనే చస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉనికిని కాపాడిన తమపై కోవర్టులు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మల పేరు పెడితే ఎందుకు ఆపారని ప్రశ్నించారు. పార్టీలో జరుగుతున్నది కాం గ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య పోరాటమని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. కుట్రపూరితంగా కాంగ్రెస్ను నాశనం చేస్తున్నారన్నారు. బయట నుంచి వచ్చినవారికి తమను ప్రశ్నించే స్థాయి లేదని దెప్పిపొడిచారు. అయితే, పీసీసీ కమిటీల్లో టీడీపీకి చెందినవారికే ఎక్కువ పదవులు ఇచ్చారన్న సీనియర్ నేతల విమర్శల్లో వాస్తవం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. టీడీపీ నుంచి వచ్చినవారికి పీసీసీ కార్యవర్గంలో ఇద్దరికి, ఉపాధ్యక్షుల్లో ఐదుగురికి, ప్రధాన కార్యదర్శుల్లో ఐదుగురికి అవకాశం కల్పించినట్టు వివరించారు. సీనియర్ నేతల వ్యాఖ్యలు పార్టీని బలహీనపరిచేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే అనిల్ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మోదీని కలవడంతోపాటు ఆయన వ్యాఖ్యలపై సీనియర్లు ఎం దుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫోన్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి తన మద్దతు ప్రకటించారు. ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా మీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తన సోదరుడు రాజగోపాల్రెడ్డి మాదిరిగానే తాను కూడా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.