హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ లోకస్భ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బలమైన నాయకుడేమీ కాదని, కానీ అధిష్ఠానం పొరబడి ఆయనకు టికెట్ ఇచ్చిందని సొంత పార్టీ నేత రాజుయాదవ్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దానం నాగేందర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలుపు కష్టమేనని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తేనే అవకాశాలుంటాయని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని డిమాం డ్ చేస్తూ స్పీకర్కి ఫిర్యాదు చేశానని, కానీ ఆయన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కాబట్టి తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.