Motkupalli Narasimhulu | తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ రేవంత్ రెడ్డి హయాంలో జరిగినంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మోత్కుపల్లి గురువారం నిరసన దీక్ష చేపట్టారు. మోత్కుపల్లి ధర్మానుగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు సంఘీభావం ప్రకటించారు. బేగంపేట లీలనగర్లోని తన నివాసంలో మెత్కుపల్లి చేపట్టిన దీక్షకు మద్దతుగా పలువురు మాదిగ నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాదిగలకు రెండేసి సీట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని వివరిద్దామని అనుకుంటే సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని, అలాంటి తనకే అపాయింట్ ఇవ్వరా? అని ఆయన ప్రశ్నించారు.
తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ రేవంత్ రెడ్డి హయాంలో జరిగినంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా సీఎం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బయట నుంచి వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని అన్నారు. కనీసం ఒక్క టికెట్ అయినా మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలామంది సీఎంలతో కలిసి పనిచేశానని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అన్నారు. రేవంత్ను కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేదని అన్నారు. నేను చస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇదే తన చివరి ప్రెస్మీట్ అని తెలిపారు.
మాదిగలకు జరిగిన అన్యాయంపై మందకృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాదిగల జనాభాకు అనుగుణంగా రెండు ఎంపీ సీట్లు కేటాయించే వరకు తన ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్కు నష్టం చేసే ఉద్దేశంతో తాను మాట్లాడటం లేదని, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు. న్యాయం కోసం పార్టీలోనే ఉండి పోరాడుతా.. తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.