Congress | ‘మహబూబ్నగర్ జిల్లాలో కరెంట్ షాక్ కారణంగా రెండేండ్లలోనే 268 మంది రైతులు మృత్యువాత పడ్డారు. 108 మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యం పొందారు. రాత్రిపూట కరెంట్ సరఫరా చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
విద్యుత్తు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులే విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చేస్తుండటం కూడా వారి ప్రాణాల మీదికి తెస్తున్నది’.. ఆగస్టు 2009లో విడుదలైన ఒక నివేదిక సారాంశం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి అర్ధరాత్రి విద్యుత్తు సరఫరా వల్ల కలిగిన నష్టానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు హామీతో గద్దెనెక్కింది. 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు ఇస్తామని 2004లో ప్రచారం చేసింది. మొదటి సంతకం అంటూ హడావుడి చేసింది. కానీ, రైతులకు ఐదారు గంటలకు మించి విద్యుత్తు ఇవ్వలేదు. పగటిపూట రెండుమూడు గంటలు మాత్రమే ఇచ్చి అర్ధరాత్రి మరో రెండుమూడు గంటలు ఇచ్చేది. కొన్నిచోట్ల రాత్రివేళ మాత్రమే వచ్చేది. దీంతో రైతులు రాత్రుళ్లు పొలాల వద్దకు వెళ్లి కరెంట్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసేవారు.
చీకటిలో స్టార్టర్లు, కరెంట్ వైర్లు, తెగిపడిన కరెంట్ తీగలు కనిపించక విద్యుత్తు షాక్తో అక్కడికక్కడే మరణించేవారు. రాత్రుళ్లు పాములు, తేళ్లు, విషపురుగుల కాటుకు బలైపోయిన రైతులు ఎందరో. చీకట్లో కానరాక బావుల్లో, గుంతల్లో పడి మరణించిన వారు మరెందరో. ఇంట్లో కుటుంబంతో గడపాల్సిన రైతులు రాత్రుళ్లు ఒంటరిగా బావుల దగ్గర ఉండేవారు. భార్యా పిల్లలు ఇంటిదగ్గర బిక్కుబిక్కుమంటూ గడిపేవారు.
8,198 మంది బలి
ఉమ్మడి రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరుముగ్గురు రైతులు కరెంట్ షాక్కు బలయ్యేవారు. మూగజీవాల సంగతి లెక్కే లేదు. రైతు సంఘాలు చెప్తున్న లెక్కల ప్రకారం.. 2004-05 నుంచి 2012-13 మధ్య తొమ్మిదేండ్లలో 8,198 మంది రైతులు కరెంట్ షాక్తో మరణించారు. దాదాపు అంతే స్థాయిలో తీవ్ర గాయాలతో దివ్యాంగులుగా మారిపోయారు.
కానీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక గణాంకాల్లో వీటిని చేర్చలేదు. విద్యుత్తు శాఖ తమ తప్పిదాన్ని ఒప్పుకునేది కాదు. దీంతో అధికారిక లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు తీవ్ర వ్యత్యాసం ఉండేది. 2009 ఆగస్టులో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాలో రెండేండ్లలోనే కరెంట్ షాక్ కారణంగా 268 మంది రైతులు మృత్యువాత పడితే.. 12 మందికి మాత్రమే విద్యుత్తు శాఖ పరిహారం చెల్లించింది. అంటే మిగతా వారి మరణాలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నమాట.
అసమర్థ విధానాలే రైతుకు శాపం
కాంగ్రెస్ హయాంలో విద్యుత్తు ఉత్పత్తికి సరిపడా వనరులు ఉన్నా ఉత్పత్తి పెంచి, రైతులకు పగటి పూట కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సరఫరా సామర్థ్యం పెంచితే కరెంట్ షాక్ మరణాలను నివారించవచ్చన్న ఆలోచన కూడా రాకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం. తెలంగాణ ఏర్పడేనాటికి గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 5,661 మెగావాట్లు మాత్రమే. అప్పటికే ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు. డిమాండ్ కన్నా ఉత్పత్తి సామర్థ్యమే ఎక్కువ. కానీ, రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్కు, సరఫరాకు మధ్య 20 శాతానికిపైగా లోటు ఉన్నదని ప్రభుత్వమే చెప్పేది. సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకొని ఉంటే ఈ దుస్థితి తప్పేదని, వేలాది రైతులు మరణించేవారు కాదని విద్యుత్తురంగ నిపుణులు చెప్తున్నారు.
మరోవైపు విద్యుత్తు శాఖలో తగినంత సిబ్బంది ఉండేవారు కాదు. వైర్లు తెగిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా రైతులే మరమ్మతులు చేయించుకోవాల్సిన దుస్థితి. మెకానిక్లు లేక, చేతిలో డబ్బులు లేక రైతులే స్వయంగా రిపేర్లు చేసుకునేవారు. నైపుణ్యం లేని కారణంగా విద్యుత్తు షాక్తో మరణించేవారు. ఫలితంగా కుటుంబాలు అనాథలుగా మారేవి. విద్యార్థులు చదువు మానేసి, బాలకార్మికులుగా మారేవారు. అనేక కుటుంబాలు పొలాన్ని పడావు పడేసి వలసలు వెళ్లి, కూలీలుగా మారాయి.
24 గంటల కరెంట్తో నిశ్చింత
తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతున్నది. దీంతో రైతులు నిశ్చింతగా ఉంటున్నారు. ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి సరఫరా వ్యవస్థలను ఆధునికీకరించింది, సామర్థ్యాన్ని పెంచింది. దీంతో వైర్లు తెగిపడి మరణించడం వంటి ఘటనలు నమోదు కావడం లేదు. మళ్లీ నాటి అసమర్థ విధానాలతో రైతుల పాలిట మృత్యువుగా మారిన రోజులు కావాలో, కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతున్న రోజులు కావాలో ఆలోచించాల్సిన సమయమిది.
రైతు సంఘాలు చెప్తున్న లెక్కల ప్రకారం..
సంవత్సరం : కరెంట్ షాక్తో మరణించిన రైతులు
2004-05 : 756
2005-06 : 854
2006-07 : 692
2007-08 : 924
2008-09 : 1,207
2009-10 : 1,210
2010-11 : 1,176
2011-12 : 832
2012-13 : 547
మొత్తం : 8,198