CM Revanth Reddy | మెదక్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో శనివారం రేవంత్ కార్నర్ మీటింగ్లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని తప్పుపట్టేలా మాట్లాడారు. మల్లన్నసాగర్ పేరుచెప్పి బీఆర్ఎస్ ఊర్లను ముంచిందని ఆరోపించారు. ముంపు గ్రామాల భూములు గుంజుకుని రైతులను తరిమికొట్టిండ్రు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ అంటున్నారు. కానీ.. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్రెడ్డి. కాంగ్రెస్ను టచ్ చేస్తే మాడి మసైపోతవ్. మేము పదేండ్లు ఇక్కడనే ఉంటం. ఎవరొస్తారో రండి. మోదీ వస్తడో,మోదీ తాతను తెచ్చుకుంటవో తెచ్చుకో. చూసుకుందాం’ అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ను నిందించే క్రమంలో కాంగ్రెస్ సీనియర్లపైనా సీఎం రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘నేను జైపాల్రెడ్డిని, జానారెడ్డిని కాదు. ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ ఇక్కడిదాక వచ్చినం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఇందిరమ్మను గెలిపించిన చరిత్ర మెదక్ ప్రజలదని అన్నారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఇక్రిశాట్ పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్పారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందరరావు మెదక్ ఎం పీ ఎలా అవుతారని ప్రశ్నించారు. చేనేత రంగంపై జీఎస్టీ విధించడం ద్వారా పద్మశాలీలను దెబ్బతీశారని, దీంతో చిన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మెదక్ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు.