Congress | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రారంభించిన ‘డొనేట్ ఫర్ దేశ్’ అనే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్పందన లభిస్తున్నది. ఈ నెల 18న విరాళాల సేకరణను ప్రారంభించగా.. గురువారం సాయంత్రం 5.20 గంటల వరకు రూ.8,57,71,985 వసూలయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచే అత్యధికంగా విరాళాలు అందడం విశేషం. తెలంగాణ నుంచి రూ. 1.38 కోట్ల విరాళాలు అందినట్టు కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ వెల్లడించింది. అందిన విరాళాల వివరాలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. విరాళాలను ఆన్లైన్లో కాంగ్రెస్ పార్టీ సేకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అయిన సందర్భంగా రూ.138, రూ.1380, రూ.13,800, రూ.1,38,000 చొప్పున, ఇతర మొత్తాల చొప్పున కూడా స్వీకరిస్తున్నది.
తెలంగాణ నుంచి అత్యధికంగా విరాళాలు అందినట్టు కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ఫండింగ్ డొనేషన్ డాష్బోర్డు వెల్లడించింది. తెలంగాణ నుంచి గురువారం సాయం త్రం వరకు రూ.1,38,46,450 అందినట్టు వెల్లడైంది. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నుంచి రూ.1,07,62,909 అందాయి. మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ నుంచి రూ. 95,76,278, ఆ తరువాతి స్థానంలో ఉన్న హర్యానా నుంచి రూ.86.98 లక్షలు, ఉత్తరప్రదేశ్ నుంచి రూ.60.76 లక్షల విరాళంగా అందినట్టు అందులో పొందుపర్చారు. అతి తక్కువగా సిక్కిం నుంచి కేవలం రూ. 2,301 మాత్రమే విరాళంగా అందినట్టు తెలిపారు. ఎక్కువ మంది విరాళాలు అందించిన రాష్ర్టాలలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఐదో స్థానంలో 6.0 శాతంతో తెలంగాణ నిలిచింది. దీనినిబట్టి తెలంగాణ నుంచి అతి తక్కువమంది అత్యధిక మొత్తంలో ఇచ్చినట్టు తెలుస్తున్నది.