Congress | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గానీ ఎంపీగా పోటీ చేయొద్దని అధిష్ఠానం మెలిక పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ వాస్తవానికి అది కారణమే కాదని, కాంగ్రెస్ తాజాగా నిర్వహించిన ప్లాష్ సర్వేలో దానం నాగేందర్ అభ్యర్థిత్వానికి కంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కే ఓటర్లు అనుకూలంగా ఉన్నట్టు తేలిందని ఆయా వర్గాల సమాచారం. ఈ విషయాన్ని అధిష్ఠాన పెద్దలు బయటికి చెప్పకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా పోటీ చేయాలని దానం నాగేందర్కు కండీషన్ పెట్టినట్టు తెలిసింది. ఎంపీగా పోటీ చేసి గెలిచాకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కాంగ్రెస్ పెద్ద లు అంగీకరించాకే పార్టీ కండువా కప్పుకున్నానని, ఇప్పుడేమో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షరతు పెట్టడమేంటని దానం నాగేందర్ మొండికేస్తున్నట్టు సమాచారం. ఇదే కారణంతో సికింద్రాబాద్కు అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ పార్టీ నేతల బృందం ఆహ్వానించింది. ఆ బృందం ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను కలిసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్ళులతోపాటు పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి శుక్రవారం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి నిరాకరించిన కడియం శ్రీహరి కుతూరు కావ్య కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి, కూతురిలో ఎవరైనా ఒకరు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఏఐసీసీ తరఫున కడియం శ్రీహరి, కావ్యను తమ పార్టీలో చేరాల్సిందిగా కోరినట్టు దీపాదాస్ మున్షీ అనంతరం మీడియాకు వెల్లడించారు. తన అనుచరులతో చర్చించి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెలిపారు.
హైదరాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైం ది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుం డా అధికార పార్టీలో చేరిన ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ నియోజకవర్గ ఓటరు బీ రాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లోకి చేరి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ మెయిల్ ద్వారా స్పీకర్కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్కు ఉన్న దా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడంపై ఏమైనా తీర్పులుంటే సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.