Congress Party | హైదరాబాద్ : తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీ హనుమంతరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీఏసీ సమావేశం తొలిసారిగా జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు.
సమావేశం ముగిసిన అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. మిగతా గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తాం. మహిళలకు నెలకు రూ. 2500 భృతిపై ఈ నెల 28న చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రూ. 4 వేల పెన్షన్ అమలు, విధివిధానాలపై చర్చిస్తున్నాం. ఈ నెల 28 నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూసిస్తాం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.