Congress | ఆదిలాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సాక్షిగా.. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. దీంతో సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్తు తరంగిణి ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన బీసీ ఐక్యవేదిక సమావేశం అనైక్య వేదికగా మారింది. ఈ సమావేశానికి వీహెచ్ హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి జిల్లాకు చెందిన మరో నేత, ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డి తన అనుచరులతో వచ్చారు. ఆయన సమావేశానికి రావడాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసించారు.
శ్రీనివాస్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. వేదికపైకి దూసుకొచ్చి గొడవకు దిగారు. శ్రీనివాస్రెడ్డి వర్గీయులు కూడా నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. వీహెచ్.. ఇరువర్గాలను సముదాయించినా గొడవ సద్దుమణగలేదు. దీంతో సమావేశం కొంత సేపు ఆగింది. చివరకు వీహెచ్ జోక్యం చేసుకుని శ్రీనివాస్రెడ్డి బయటకు వెళ్లాలని సూచించారు. ఆయన కదలకపోవడంతో వీహెచ్ స్వయంగా వేదిక పైనుంచి కిందికి దిగడంతో శ్రీనివాస్రెడ్డి అనుచరులతో కలిసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
శ్రీనివాస్రెడ్డిపై సస్పెన్షన్ వేటు
డబ్బు అహంకారంతో శ్రీనివాస్రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తానే ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటూ జిల్లా నేతలను కించపర్చే వ్యాఖ్యలు చేస్తున్నారని, బీసీ ఐక్యవేదికలో గందరగోళానికి కారణమైన శ్రీనివాస్రెడ్డిని పార్టీ నుంచి ఆరేండ్లు సస్పెండ్ చేస్తున్నామని సాజిద్ఖాన్ తెలిపారు. ఈ సస్పెన్షన్ను అధిష్ఠానం ఆమోదించకపోతే ముఖ్యనేతలందరం కాంగ్రెస్ను వీడుతారని హెచ్చరించారు. శ్రీనివాస్రెడ్డి ఆగడాలకు పీసీసీ అడ్డుకట్ట వేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు.