Congress | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు.. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావో రేవో అన్నట్లుగా మారిన పార్లమెంటు ఎన్నికలు.. వీటన్నింటికీ మించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అచ్చి వచ్చిన వేదిక.. ఇలాంటి కీలక పరిణామాల మధ్య లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన జన జాతర ఉసూరు మనిపించింది. పాలనా యంత్రాంగం సహకారంతో కరువు పరిస్థితులను సైతం పక్కనబెట్టి మనసు పెట్టి సభా ఏర్పాట్లు చేసినప్పటికీ అధిష్ఠానం ఆశించిన స్థాయిలో పార్టీ శ్రేణులు, జనం తరలిరాలేదు. ఏకంగా పది లక్షల మందితో జన జాతర సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు కూడా పలుసార్లు ప్రకటించారు. పదిలక్షలన్న చోట కనీసం ఐదు లక్షలైనా వస్తారని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు ఆశించారు. కానీ అందులో ఐదో వంతు జనం కూడా తరలిరాలేదు. జన జాతరలో చూస్తే మాత్రం సభా ప్రాంగణంలోనే కాదు.. బయట ఉన్న వారిని కలిపినా లెక్క సరిపోవడం లేదని అంటున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ప్రాంగణంలో నిర్వహించిన జోష్ కూడా ఇప్పుడు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇది లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురి చేసే పరిణామంగానే పరిశీలకులు భావిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల దరిమిలా అధికార కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జన జాతర బహిరంగ సభ ఆద్యంతం చప్పగా కనిపించింది. వాస్తవానికి కాంగ్రెస్ నేతలు ముందుగా ప్రకటించినట్లు పది లక్షలు కాకున్నా.. కనీసంగా ఐదారు లక్షల మందితో సభ జరుగుతుందని అందరూ అంచ నా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఢిల్లీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో ఈ బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రనేత రాహుల్గాంధీతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ వంటి హేమాహేమీలు సభకు హాజరయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వేదికను ఎంచుకున్నారు.
రాజీవ్గాంధీ సభా ప్రాంగణం పేరుతో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో ఇక్కడ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని చేపట్టింది. అందుకే భారీ బహిరంగ సభతో పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అదే తరహా సత్తాను చాటుతుందని చెప్పేందుకు అచ్చి వచ్చిన ఆ సభా ప్రాంగణాన్నే మరోసారి ఎంపిక చేసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ఒక్కరోజు తర్వాత హైదరాబాద్లో తలపెట్టిన ఈ సభను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకను కాదని హై కమాండ్ హైదరాబాద్ను ఎంచుకున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సభా ఏర్పాట్లపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో పార్టీ, ప్రభుత్వం రెండు ఉన్నందున జన జాతర మోత మోగుతుందని చాలామంది అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లలోనూ పాలనా యంత్రాంగమే నిమగ్నమైంది. అన్ని జిల్లాల నుంచి జనం, పార్టీ శ్రేణుల్ని సమీకరించేందుకు ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. సభా ఏర్పాట్లను సీఎం, మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జన జాతరను ఏకంగా పది లక్షల మందితో నిర్వహించి అగ్రనేత రాహుల్ను సంతృప్తిపరచాలని అన్ని శక్తు లూ ఒడ్డారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందోగానీ… ఆశించిన దానిలో కనీసం పట్టుమని పది శాతం జనం రాకపోగా, వచ్చిన క్యాడర్లోనూ మునుపటి జోష్ కనిపించలేదనే విశ్లేషణలు రాజకీయ పరిశీలకుల నుంచి వెలువడుతున్నాయి.
ఒకవిధంగా చెప్పాలంటే… గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల దరిమిలా ఇదే ప్రాంగణంలో చేపట్టిన ఆరు గ్యారెంటీల ప్రకటన సభలో జోష్ కనిపించింది. సభకు వచ్చిన జనంతో పాటు నేతల ప్రసంగ సమయంలోనూ క్యాడర్ ఉత్సాహంగా కనిపించారు. కానీ పార్లమెంటు ఎన్నికల దరిమిలా శనివారం నిర్వహించిన సభలో ఎందుకో ఆ జోష్ ఏమాత్రం కనిపించలేదని సభను పరిశీలించిన వారు స్పష్టం చేస్తున్నారు. సభికుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మంత్రులు తమ ప్రసంగాల్లో ఆవేశాన్ని నింపే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితం రానట్లుగా తెలుస్తున్నది. రాహుల్ ప్రసంగం కూడా సాదాసీదాగానే సాగింది తప్ప జనాన్ని ఉత్సాహపరిచేలా సాగలేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఆద్యంతం శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడం, జోష్ కనిపించకపోవడం వెనక కొన్ని ప్రధాన కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటికీ ప్రజలు సంతృప్తిచెందేలా గ్యారెంటీలను అమలు చేయలేకపోవడం, రైతుబంధు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, అమలు చేశామని చెబుతున్న హామీలు కూడా అర్హులందరికీ అందకపోవడంతో అటు సాధారణ జనం, ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్లో నైరాశ్యాన్ని నింపిందని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు కూడా ఈ సభపై తీవ్ర ప్రభావాన్ని చూపాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ పంటలు ఎండిపోయి అన్నదాత ఆవేదనలో ఉన్నాడు. ఈ క్రమంలో అధికార పార్టీ నిర్వహించిన సభకు తరలివెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసినప్పటికీ వెళ్లాలనే ఉత్సాహం రైతాంగంలో లోపించిందనే వాదన ఉంది. ఒకవేళ రైతు మంచి పంటలు పండించి ఉంటే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యేదని, కానీ కరువు పరిస్థితులు అందునా సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం రైతాంగంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిందని సీనియర్ పాత్రికేయుడు ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పోలింగు మరో నెల రోజుల వ్యవధిలోనే ఉండటంతో జన జాతర మిగిల్చిన ఈ నైరాశ్యం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు.
తుక్కుగూడలో సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో జన జాతర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 250 మంది ఆసీనులయ్యేలా సభా వేదికను ముస్తాబు చేసింది. బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, మంచి సౌండ్ సిస్టం, పెద్ద ఎత్తున మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. తొలుత లక్షన్నర కుర్చీలు ఆర్డర్ ఇద్దామని అనుకున్నా… 50-60వేల కుర్చీలు మాత్రమే వేశారని పార్టీనేతలు కొందరు చెప్పారు. అయినప్పటికీ సభా ప్రాంగణం వెనకలో ఉన్న కుర్చీలు కొన్ని వరుసలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. ఆ మేరకు సభా ప్రాంగణం బయట రంగారెడ్డి కలెక్టరేట్ వరకు కూడా కొన్ని వేలల్లో జనం ఉన్నారు. ఇలా బయట, లోపల జోడించినా దాదాపు లక్ష వరకు మాత్రమే జనం వచ్చారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపట్టిన బహిరంగ సభకు ఆశించిన దానిలో పదో వంతు జనం మాత్రమే రావడం వెనక కారణాలు ఏమిటనే చర్చ మొదలైంది.