హైదరాబాద్: సీనియర్ నాయకుల ప్రత్యేక సమావేశం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) హీటుపుట్టిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు హైదరాబాద్లోని అశోకా హోటల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, శ్యామ్మోహన్ రావు, కమలాకర్రావుతోపాటు పలువురు నేతలు హోటల్కు చేరుకున్నారు.
అయితే సీనియర్ నేతలు ప్రత్యేక భేటీలు వద్దని పార్టీ అధినాయకత్వం సూచించింది. సమస్యలుంటే అధిష్ఠానానికి తెలపాలని సూచించింది. పార్టీ సూచనలు ధిక్కరించి సమావేశం కావొద్దని ఏఐసీసీ హెచ్చరించింది. అయినప్పటికీ నాయకులు సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాగా, తాము చేస్తున్నదాంట్లో తప్పేమీ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్ఠానానికి తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పంజాబ్ తరహాలో పార్టీ నష్టపోవద్దనేదే తమ ఉద్యేశమని వెల్లడించారు. పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే లాభం ఉండదని తెలిపారు.