వనపర్తి : వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పదవికి నిరంజన్ పాషా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో నిరంజన్ పాషా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిరంజన్ పాషాకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి నిరంజన్ రెడ్డి. నిరంజన్ పాషాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, స్వామిగౌడ్, అల్తాఫ్, శ్రవణ్, ఇస్మాయిల్, అరిఫ్తో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులు, అభినందనలే ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. గత మూడేండ్లుగా అభివృద్ధి మీద తప్ప ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి.. చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించమని కోరుతానని తెలిపారు. తాను చేసిన పనులు, చేస్తున్న అభివృద్ధి సత్యం అయితేనే తనకు అండగా నిలవాలని కోరుతానని చెప్పారు. వనపర్తి పట్టణంలో దుర్గంధంతో నిండిన కందకాన్ని శుభ్రం చేసి మార్కెట్ను నిర్మించడం జరిగిందన్నారు. అంతకు ముందు కందకం ప్రాంతం దోమలు, పందులు, పాములు, మురుగునీరుతో నిండి ఉండేదని గుర్తు చేశారు. దాని నిర్మాణం చేపట్టినప్పుడు ప్రజలు అపోహా పడ్డారు.. నిర్మాణం పూర్తయ్యాక ఇప్పుడు ఆనంద పడుతున్నారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.