హైదరాబాద్ : రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీసులపై కాంగ్రెస్ సీనియర్లు చేయి చేసుకున్నారు. రాజ్భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర చొక్కా పట్టుకుని రేణుకా లాగారు. రేణుకాను అడ్డుకోబోయిన మరో మహిళా కానిస్టేబుల్పై కూడా ఆమె చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఆమె రెచ్చిపోయారు. పోలీసు స్టేషన్కు వచ్చి మరీ కొడుతానంటూ బెదిరించారు. రేణుకా చౌదరి ఎంత ఓవర్యాక్షన్ చేసిన పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. మొత్తానికి రేణుకా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క నానా హంగామా సృష్టించారు. పోలీసులపై దుర్భషలాడారు. అక్కడ విధుల్లో ఉన్న వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ను భట్టివిక్రమార్క నెట్టేశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రాజ్భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర చొక్కా పట్టుకుని ఆమె లాగారు. pic.twitter.com/oQ2N3a9l6g
— Namasthe Telangana (@ntdailyonline) June 16, 2022
ఇక రాజ్భవన్ వైపుకు వెళ్లకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆర్టీసీ బస్సు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఓ బైక్కు నిప్పు పెట్టారు. ఉన్మాదంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్, రాజ్భవన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.