కల్వకుర్తి రూరల్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు ప్రచారాలు.. ఆర్భాటాలపైన ఉన్న మక్కువ ప్రజాపాలన, ప్రజా సంక్షేమంపైన లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పరిణయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపై చిత్తలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 11వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అనడం సరైంది కాదని రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ పూర్తైన వారు దాదాపుగా ఐదు లక్షల వరకు ఉంటారని వారందరికీ ఉద్యోగాలు కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామకంపైన పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రజాపాలన పేరుతో రేవంత్ సర్కారు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పీడిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దుయ్యబట్టారు. రాష్ర్టాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చుతామని చెప్పి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడితే ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం ప్రజా సమస్యలను విస్మరించడమేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తోందని అన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.