హైదరాబాద్: సాగు నీరులేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. హస్తం పార్టీ నేతలు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీ మేరకు పంటకు బోనస్ ఇస్తారో లేదో చెప్పాలన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జలాశయాల్లో నీటి లభ్యత ఉన్నా ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే అధికారిక లెక్కల ప్రకారం 1 లక్ష 45 వేల ట్యాంకర్లను వాడారని చెప్పారు. ఇవి కాక ఎన్ని రెట్లు ప్రైవేట్ ట్యాంకర్లు నీళ్ల వ్యాపారం చేశారో కళ్లారా చూస్తున్నామని విమర్శించారు.
యాసంగి పంటలు వస్తున్నా వరి ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో ఇప్పటికీ స్పష్టలేదన్నారు. యాసంగి పంటను కనీస మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థానికి పెంచామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీ నుంచి చేరికలపై దృష్టి పెట్టిందన్నారు. కేసీఆర్ హయాంలో సాగు, తాగునీటికి కొరత రాలేదని తెలిపారు. రైతుల ఆత్మహత్యల వివరాలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. ఆత్మహత్య చేసకున్న రైతు కుటుంబాలను పరామర్శించడం లేదని చెప్పారు. ఎండిన పంటను చూసేది లేదు.. రైతులకు భరోసా ఇచ్చేది లేదన్నారు. పాలనపై, ప్రజలపై మంత్రులకు ఎలాంటి శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ మీద కోపంతో మహనీయుడు అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. కేసీఆర్ కట్టించాడన్న అక్కసుతో ప్రజలు, ప్రజా సంఘాలు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లకుండా తాళం వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి అప్పడు కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్లో కూర్చోకండని వెల్లడించారు. కేసీఆర్ కట్టించిన మిషన్ భగీరథ నుంచి నీళ్లు ఇవ్వకుండా మీరు సొంత కార్యక్రమంతో నీళ్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ అంటే మొదటి నుంచి గిట్టదన్నారు.