Harish Rao | రాష్ట్రంలోని ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం7500 రూపాయలు బాకీ పడిందని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇచ్చి మహాలక్ష్ములను చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మ్యానిఫెస్టోలో పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ మహాలక్ష్మీ పథకం మహా మోసంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్రావు.. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో చేసిన మోసాలను నిలదీశారు.
‘ఇవాల్టికి కాంగ్రెస్ పాలన వచ్చి 100 రోజులు పూర్తయ్యింది.. అంటే మూడు నెలలు నిండి నాలుగు నెలలు నడుస్తున్నాయి. అంటే మూడు నెలలకు లెక్కేసుకున్నా.. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7500 బకాయి పడింది’ అని హరీశ్రావు అన్నారు. బకాయి పడ్డ 7500 రూపాయలను మా అక్కాచెల్లెళ్లకు చెల్లించిన తర్వాతనే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని.. కనీసం వారికి ఇచ్చినా కూడా దాదాపు ఈ మూడు నెలల్లో 7500 కోట్లు మహిళలకు చేరేవని అన్నారు. అంటే ఈ రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లకు రూ.7500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు.
మహిళలను మోసం చేసింది కాకుండా ఏ మొహం పెట్టుకుని మహిళా సదస్సు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్రావు మండిపడ్డారు. మిమ్మల్ని బిందెలు పట్టుకుని మళ్లీ రోడ్ల మీదకు తెచ్చినం.. మీకు 2500 ఇవ్వకుండా మోసం చేసినం.. అని మహిళా సదస్సు పెట్టారా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2500 ఇస్తామని మ్యానిఫెస్టోలో మొదటి హామీగానే పేర్కొన్నారని.. దీనిపై బాండ్ పేపర్ కూడా రాసిచ్చారని గుర్తు చేశారు. బాండ్ పేపర్ మీద రాసివ్వడం అంటే ఒక నమ్మకం కల్పించడమని తెలిపారు. కానీ బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేస్తే ఇది చీటింగ్ కాదా? అని అన్నారు. మీపై ఎందుకు చీటింగ్ కేసు నమోదు చేయవద్దని ప్రశ్నించారు. ప్రతి మహిళకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ 7500 బాకీ పడిందని పునరుద్ఘాటించారు.
కల్యాణలక్ష్మీతో తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ వంద రోజుల్లో పెళ్లిళ్లే కాలేదా? అని ప్రశ్నించారు. అక్కాచెల్లెళ్లకు సెంటిమెంట్గా చెప్పారు కదా.. తులం బంగారం ఏమైందని నిలదీశారు. ఈ వంద రోజుల్లో లక్షల పెళ్లిళ్లు అయ్యాయని.. ఆ లక్షల మందికి తులం బంగారం కచ్చితంగా చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఆడబిడ్డలను మోసం చేసినట్టే అని పేర్కొన్నారు.