హైదరాబాద్, ఆగస్టు 17, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించడమా? ఇదెక్కడి పద్ధతి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ విస్తుపోయారు. ఒకవైపు బీజేపీలో టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
గాంధీభవన్లో బుధవారం మునుగోడు నియోజకవర్గ మండలాల ఇన్చార్జీలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సమావేశానికి అందరినీ పిలవాల్సిన అవసరం లేదని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి అన్నారు. సీనియర్లను వారి అవసరం ఉన్నప్పుడే పిలుస్తామని స్పష్టం చేశారు.