Renuka Chowdhury | హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్లో జెండాలు మోసిన వాళ్లకు కాదని, చెప్పులు మోసేవాళ్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి నిప్పులు చెరిగారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగే పరిస్థితి లేదు’ అని సొంత పార్టీ, ప్రభుత్వం పైనే విమర్శలు చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్య్యూలో పలు అంశాలపై ఆమె చేసిన వాఖ్యలు కాంగ్రెస్ పార్టీ, రాజకీయనేతల్లో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని వెల్లడించారు. జెండాలు మోసిన వాళ్లను పక్కనపెట్టి, పార్టీలు మారి వచ్చినవారికి, చెప్పులు, సంచులు మోసేవాళ్లకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా సుడా చైర్మన్ పదవిని దుర్గాప్రసాద్కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పదవుల విషయంలోనే కాకుండా ప్రభుత్వ పనితీరుపైనా కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని వివరించారు.‘కోతి కోతి కొట్టుకుంటే మధ్యలో ఎవరో వచ్చి రొట్టెముక్కను దొంగిలిచుకుపోయినట్టుగానే పాత కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితే లేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి వచ్చిన వారు మంత్రులు అయ్యారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి సైతం అన్ని విషయాలను తీసుకెళ్లానని, అనంతరమే బాహాటంగా విమర్శలు చేస్తున్నానని వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కార్పొరేషన్లు, వివిధ నామినేటెడ్ పదవుల కేటాయింపులపై రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏమాత్రం అడ్రస్ లేని వారికి, అసలు కాంగ్రెస్ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ (వైరా టౌన్) పరిధిలోని వారికే వరుసగా ఐదు కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు (డీసీసీ ప్రెసిడెంట్, హస్తకళల కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, సుడా చైర్మన్, బ్రాహ్మణ కార్పొరేషన్) ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు. వైరా ప్రాంతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార నేటివ్ ప్లేస్ కావడం వల్లే అకడ ఎకువ పదవులు ఇచ్చారా? అనే అంశంపై స్పందిస్తూ.. ‘ఆయన డిప్యూటీ సీఎం, పదేండ్లు ఎమ్మెల్యే, అయితే జిల్లాలోని అన్ని పదవులనూ ఆయనకే ఇచ్చేయమనండి. మిగతా కార్యకర్తలు ఎవరూ వద్దు, తప్పుకోండని బహిరంగంగా చెప్పేయండి. అహంకార రాజకీయాలు సరికాదు’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ అన్యాయమైన పదవుల పంపకాల వ్యవహారాన్ని, సిఫార్సుల వెనుక ఉన్న నిజాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా ఆధారాలతోసహా తీసుకెళ్లానని స్పష్టంచేశారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని, త్యాగాలు చేసిన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దకాలనే తాను ఈ పోరాటం చేస్తున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రేణుకాచౌదరిని కొందరు పకన పెట్టారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నన్ను బ్యాన్ చేసేంత మొనగాడు ఇంకా పుట్టలేదు. ఆ భ్రమల్లో ఎవరైనా ఉంటే వారి తిక త్వరలోనే వదులుతుంది’ అంటూ తనదైన శైలిలో రేణుకాచౌదరి ఫైర్ అయ్యారు. రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా గ్రౌండ్లోకి దిగుతానని, కార్యకర్తల పక్షాన నిలబడుతానని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు రేవంత్రెడ్డికి తానే స్వయంగా ఖమ్మం జిల్లాలో పూర్తి మద్దతు ప్రకటించానని, కార్యకర్తలతో సీఎం రేవంత్ అని నినాదాలు చేయించింది తానేనని రేణుకాచౌదరి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నరేండ్లలో తాను ఆశించిన స్థాయి మద్దతు రేవంత్రెడ్డి నుంచి లభించిందా? లేదా అనే ప్రశ్రపై స్పందిస్తూ.. ‘కొన్ని అవకతవకలు జరిగినయ్. అందుకోవాల్సిన స్థాయికి ఇంకా ఎదగలేదు’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. తనకు దకిన రాజ్యసభ సీటు రేవంత్రెడ్డి వల్ల కాదని, కేవలం సోనియాగాంధీ, హైకమాండ్ తన అర్హతను చూసి ఇచ్చారని స్పష్టంచేశారు.