నల్లగొండ, అక్టోబర్ 15 : నల్లగొండ నియోజకవర్గంలో ఏకైక కాంగ్రెస్ ఎంపీపీ మనిమద్దె సుమన్ బీఆర్ఎస్లో చేరడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం హైదరాబాద్లో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సుమన్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మండలాలు ఉండగా, ఒక్క నల్లగొండ మినహాయిస్తే తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే కాగా నల్లగొండ ఎంపీపీ సుమన్ మాత్రమే కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన సైతం బీఆర్ఎస్లో చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎంపీపీ లేకుండా పోయారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. నల్లగొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరగుతున్నదని, అది పూర్తిస్థాయిలో కొనసాగాలంటే మరోసారి కేసీఆరే సీఎం కావాలనే ఆలోచనతో బీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందేందుకు కృషి చేస్తానని తెలిపారు.