నెరవేరని హామీలు.. అడ్రస్ లేని ఆరు గ్యారెంటీలు.. అటకెక్కిన ప్రగతి, నిధులివ్వలేని దుర్గతి!.. వీటన్నింటి నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఇప్పటికే దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు.. 99 రోజుల కార్యక్రమాలకూ వెళ్లేదిలేదంటూ నేరుగా ముఖ్యమంత్రికే తేల్చిచెప్పేశారు.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తాజాగా ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, దీనిని పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినట్టు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ఆయనకే ఈ మాట చెప్పినట్టు చర్చ జరుగుతున్నది. ‘మీరు ఎన్నైనా చెప్పండి.. ప్రస్తుత పరిస్థితుల్లో మేం ప్రజల్లోకి వెళ్లలేం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లినా ప్రజల నుంచి ఛీత్కారాలు, నిరసనలు, ప్రశ్నలు తప్పవు. ఇవన్నీ భరించడం కన్నా ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది’ అని ఎమ్మెల్యేలు స్పష్టంచేసినట్టు తెలిసింది. తమకు బదులుగా అధికారులనే పంపించాలని సూచించినట్టు సమాచారం.
సంక్షేమ పథకాల అమల్లో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని, దీంతో నిరసన సెగలను తాము ఎదుర్కోవాల్సి వస్తున్నదనే ఆందోళన ఎమ్మెల్యేల్లో నెలకొన్నది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఆ ప్రభావం తమపై పడుతున్నదని చెప్తున్నారు. యాసంగి సాగు ముగింపు దశకు చేరుకున్నా, రైతులకు రైతుభరోసా పంపిణీ చేయలేదని గుర్తుచేస్తున్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రైతుభరోసా ఎప్పుడంటూ రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పమంటారు? పింఛన్ల పెంపు ఏదని అవ్వా తాతలు, రూ.2,500 ఏవని మహిళలు అడిగితే ఏమని చెప్పాలి?’ అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. రైతుభరోసాపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండుసార్లు రైతులకు మాట ఇచ్చి తప్పారని, ఇప్పుడు మరోసారి తాము చెప్తే నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరని అన్నట్టు తెలిసింది. యూరియా కొరత, రైతుభరోసా ఇవ్వకపోవడం, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో ఇప్పటికే ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
గతంలో ఎప్పుడూలేని విధంగా అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు అధికారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ ఫలితాన్ని తాము అనుభవించాల్సి వస్తున్నదని, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తున్నదనే ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొన్నది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఎంత మొత్తుకున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం గ్రామాల్లోకి వెళ్లడంలేదు. అయితే హైదరాబాద్లో, లేదంటే జిల్లా కేంద్రాల్లోనే ఉంటున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను ప్రజల వద్దకు పంపించారు తప్ప, ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదు. ఒకవేళ ఎప్పుడైనా నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చినా.. అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఇంత జాగ్రత్త పడినప్పటికీ, ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు నిరసనలు తప్పడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక రూపొందించడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మరింత ఎక్కువైందనే చర్చ పార్టీలో జరుగుతున్నది. దీంతో ప్రజా వ్యతిరేకతను ముందే పసిగట్టిన ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేశారు.
99 రోజుల ప్రణాళికలో సీఎం వర్సెస్ ఎమ్మెల్యేల పోరులో ఎమ్మెల్యేలే నెగ్గారు. తొలుత ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలనే సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు పార్టీలో చర్చ జరిగింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి వెనక్కి తగ్గి, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి స్పష్టతనిచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాలకు వచ్చినా రాకపోయినా పట్టించుకోవద్దని, మీ పని మీరు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్టు తెలిసింది.