MLA Revuri Prakash Reddy | వరంగల్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పలేదని, ఏడాది లోపు చేస్తామని చెప్పామని పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి శుక్రవారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డిసెంబర్లోనే రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ చెప్పారు కదా అని విలేకరులు గుర్తుచేస్తే, అదేమీ లేదని దాటవేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని తాము చెప్పలేదని, అందుకు ఏడాది సమయం కావాలని తెలిపారు.
ఈ విషయంలో తాము ఏం చెప్పామో కావాలంటే ఒకసారి చూసుకోవాలని చెప్పారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని వివరించారు. కడియం కావ్యపై పార్టీలో వ్యతిరేక ఉన్నదన్న విషయాన్ని అంగీకరించారు. ప్రతి పార్టీకి ప్రారంభంలో కొంత వ్యతిరేకత ఉంటుందని పేర్కొన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండుమూడు రోజుల్లో పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయని పేర్కొన్నారు. రుణమాఫీకి ఏడాది పడుతుందంటూ రేవూరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.