హైదరాబాద్ : కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ను చంపడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు.
భట్టి విక్రమార్క ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వేశ్వర్ రెడ్డి తన వ్యక్తిగత ఎజెండా కోసం బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ రాజకీయ ప్రయోజనం పొందుతున్న బీజేపీలో చేరడం ద్వారా కొండా తనలో ఉన్న ఫ్యూడల్ లక్షణాలను బయట పెట్టుకున్నాడని విమర్శించారు.
నిన్నటి దాకా కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను లౌకిక ప్రజాస్వామ్య వాదిగా ఫోజు కొట్టాడు. ఇవాళ ఆయన బీజేపీలో చేరి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టకున్నాడని దుయ్యబట్టారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నుంచి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే తాను గెలవలేక కాంగ్రెస్ చచ్చిపోయింది అని కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు.