హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగానికి అధికారపక్షం పదే పదే అడ్డుతగిలింది. కేటీఆర్ ప్రసంగం దాదాపు గంటన్నర కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు పన్నెండుసార్లు అడ్డుకున్నారు. మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాలపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని కేటీఆర్ తప్పుబట్టగా, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క లేచి మహిళలకు రూ.57 వేలకోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని చెప్పారు. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ.. రూ.57వేల కోట్లు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఇదే అశంపై మరోసారి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందిస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పందిస్తూ మహిళలకు రెండేండ్లలో రూ.57 వేల కోట్లు ఇచ్చామని, అయితే మొత్తం వడ్డీరహిత రుణాలు కాదని స్పష్టంచేశారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్బాబు చెప్పిన అంశాలతో మంత్రి విభేదించారని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్లో ఎంవోయూలు, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి మాట తప్పిన తీరుపై కేటీఆర్ మాట్లాడుతుండగా మంత్రులు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సైతం కేటీఆర్పై విమర్శలు గుప్పించేందుకు యత్నించారు. ఈ సందర్భంలో గతంలో ఆయన ప్రపంచబ్యాంకుకు లేఖ రాసి ప్రభుత్వ డొల్లతనాన్ని ఎండగట్టిన అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దీంతో అప్పటిదాకా దూకుడుగా వ్యవహరిస్తూ రన్నింగ్ కామెంట్రీ చేసిన మదన్మోహన్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
పంచ్లు, సెటైర్లతో విరుచుకుపడ్డ కేటీఆర్
కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపు అధికార పక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. అయినప్పటికీ కేటీఆర్ సంయమనంతో వ్యవహరించారు. నవ్వుతూనే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల విమర్శలను తిప్పికొట్టారు. వారు చెప్తున్న తప్పులు, గతంలో ఇచ్చిన హామీలు, అమల్లో విఫలమైన తీరును ఎత్తిచూపారు. పురాణాలు, గొప్ప గ్రంథాలు, మహనీయుల మాటలను ఉటంకిస్తూ కాంగ్రెస్ సర్కార్ డొల్లతనాన్ని ఎండగట్టారు. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు, విస్మరిస్తున్న తీరుపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ విరుచుకుపడ్డారు. పరిశ్రమల స్థాపన, ఎంఈవోయూలు, ఉద్యోగాల కల్పన, రైతుబంధు ఎగ్గొట్టిన తీరును సోదాహరణంగా అంకెలు, ఆధారాలు సహా వివరించారు. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు సైతం బిత్తరపోయారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు సంబంధంలేని విషయాలను ప్రస్తావిస్తూ తప్పుదోవపట్టించేందుకు ప్రయాసపడ్డారు.