నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు సీపీఐ నల్లగొండ జిల్లా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం సీపీఐ నాయకులు నల్లగొండలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు హాజరై ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై చర్చించారు. గతంలో నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన సీపీఐకి మునుగోడును కేటాయించాలని జిల్లా కౌన్సిల్ సభ్యులు కోరారు. లేకుంటే తమకు స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర, జాతీయ కౌన్సిళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.