హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి, మరోవైపు సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్లను స్థానికంగా దెబ్బతీయడంతో పాటు అధిష్ఠానం వద్ద వారిని పలుచన చేసేలా రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నారు. అధిష్ఠానానికి తమపై ఉన్నవీ, లేనివీ చెప్తూ తమ పట్ల వ్యతిరేకతను పెంచేలా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని పలువురు సీనియర్లు భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో చేరికలపై అధిష్ఠానం అనుమతి తీసుకొంటున్న రేవంత్రెడ్డి.. స్థానిక నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వీరంతా చేరికలను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, వారిని పలుచన చేస్తున్నట్టు సమాచారం.
అధిష్ఠానం సీరియస్.. నేడు డిన్నర్ మీట్
రాష్ట్ర కాంగ్రెస్లో కుమ్ములాటలను సీరియస్గా పరిగణిస్తున్న అధిష్ఠానం పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం జూబ్లీహిల్స్ క్లబ్లో డిన్నర్ మీట్ ఏర్పాటుచేస్తున్నారు. డిన్నర్కు రావాలని పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితోపాటు నేతలందరికీ ఆహ్వానం పంపారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా అసంతృప్త నేతలు, సీనియర్లతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నది.
ఈ భేటీకి సీనియర్లు ఎంతమంది వస్తారనే అంశంపై మీమాంస నెలకొన్నది. ఒకవేళ వెళ్తే .. ఈ భేటీలో తమ అసంతృప్తిని వెల్లడించాలని సీనియర్లు భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో తమకు జరుగుతున్న అవమానాలు, అవహేళనలు, ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలపై గట్టిగానే నిలదీయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఠాగూర్ కూడా రేవంత్రెడ్డి మనిషేనని, ఆయన వల్ల తమకు ఎలాంటి మేలు జరగదనే అభిప్రాయంతో పలువురు సీనియర్లు ఉన్నట్టు సమాచారం. రేవంత్రెడ్డి, మాణిక్కం ఠాగూర్ బంధంపై గతంలో చాలామంది సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
కార్యవర్గ భేటీకి సీనియర్ల డుమ్మా
శనివారం నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశానికి కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టడం ద్వారా రేవంత్రెడ్డి, మాణిక్కం ఠాగూర్కు ఝలక్ ఇచ్చారు. రేవంత్, ఠాగూర్, మరికొందరు నేతలు మినహా కీలక నేతలెవరూ సమావేశానికి హాజరుకాలేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క లాంటి కీలక నేతలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరంతా కావాలనే సమావేశాన్ని బాయ్కాట్ చేసినట్టు తెలిసింది. సమావేశంలో తమను మాట్లాడనివ్వరు, తమ వాదనలకు విలువ ఇవ్వరనే అభిప్రాయంతో ఉన్న సీనియర్లు సమావేశానికి వెళ్లకపోవడమే మంచిదని భావించినట్టు తెలిసింది. ఆదివారం జరుగనున్న డిన్నర్ మీట్కు ముందే సీనియర్లు ఇటు రేవంత్రెడ్డికి, అటు మాణిక్కం ఠాగూర్కు ఝలక్ ఇచ్చారంటూ గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.