Errabelli Dayakar Rao | రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ తలపెట్టిన మహా ధర్నా స్థలాన్ని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిందని విమర్శించారు.
ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వాస్తవాలను వెల్లడిస్తే తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాలను అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. లగచర్లలో గిరిజనుల మీద దాడులపై నిరసనలు తెలుపుతామని తెలిపారు. రేపటి మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఈ ధర్నాకు వ్యతిరేకంగా దాడులు చేస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా గిరిజనులు స్వచ్ఛందంగా ఈ మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.