వరంగల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పూర్తిగా పక్కనపెట్టి పర్సంటేజీల పాలనను కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్లకొండ శ్రీనివాస్ (వాసు) పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అలవికానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేయడంలో చేతులెత్తేసిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇచ్చిన హామీలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా లేదన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, ఉపాధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన నాయకులు, కార్యకర్తలు తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారని తెలిపారు. పరకాల నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్లో చేరికలు మరింత పెరుగుతాయని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. పార్టీలో చేరిన వారిలో మడత శ్రీనివాస్, మడత శ్రీనివాస్, దామెరుప్పుల విశ్వనాథం, పరికి ఎసోబు, బొల్ల రాజు, గుర్రం సుమన్ తదితరులు ఉన్నారు.