నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: సీఎం కేసీఆర్ జనరంజక పాలన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం కూడా ఆయా జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన సుమారు 50 మంది యువకులు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం పులిమామిడి ఎంపీటీసీ రాజమ్మ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. బీజేపీతోపాటు కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. దావూద్గూడలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీగా టేకుల భాస్కర్రెడ్డి, తుక్కుగూడ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ వార్డు సభ్యులు, పార్టీల అధ్యక్షులు తదితరులు పెద్ద ఎత్తున చేరారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్కు చెందిన మాజీ జడ్పీటీసీ బాయికాడి బాలయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్ బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు వీరగంటి జ్యోతిజగదీశ్తోపాటు పలువురు బీజేపీ మహిళా నేతలు బీఆర్ఎస్లో చేరారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో తిరుమలగిరి సాగర్ మండలం సుంకిశాల తండా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ రమావత్ రవీందర్, వార్డు సభ్యులు పాల్తీ మునీ, కస్నా, పలువురు గిరిజనులు బీఆర్ఎస్లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో నార్కట్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్పల్లికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 50 మంది, చిట్యాల పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఫార్వర్డ్ బ్లాక్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 200 కుటుంబాలు, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 20 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో నాగారం మండలంలోని వర్ధమానుకోటకు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.