Congress | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు ‘కనుగోలు’ ఫ్లాష్ సర్వే షాకిచ్చింది. ఇప్పటి వరకు చక్కర్లు కొట్టినవారి పేర్ల స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఆశలు పెట్టుకున్న వారిలో దాదాపు సగం మందికి ‘చెయ్యి’చ్చినట్టేనన్న ప్రచారం జరుగుతున్నది. ఎవరూ ఊహించని కొత్త ముఖాలు తెరపైకి రావడమే అందుకు కారణం. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయినట్టు ప్రచారం జరిగినప్పటికీ, బుధవారం గాంధీభవన్లో కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాసు మున్షీ గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరించడం కొత్త పేర్లు తెరపైకి రానున్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చింది. ఖమ్మం, నాగర్కర్నూల్, మల్కాజిగిరి, భువనగిరి, చేవెళ్ల, వరంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఈ స్థానాల్లో ఇప్పటికే ఖరారైన అభ్యర్థుల స్థానాల్లో కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి వదిలేసినట్టు తెలిసింది.
రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఈ నెల 15కి వాయిదా పడింది. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి వెళ్లాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కమిటీ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ హాజరు కావాల్సి ఉండగా తెలంగాణ అభ్యర్థుల ఎంపిక లేకపోవడంతో గైర్హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి కొందరు కీలక నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారన్న సమాచారమే రెండోజాబితా విడుదల వాయిదాకు కారణంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ ఇప్పటి వరకు నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఏడెనిమిదిమంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే 15 మంది అభ్యర్థులను, బీఆర్ఎస్ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందడుగు వేస్తున్నది. బీఆర్ఎస్ నుంచి పోటీకి సుముఖంగా లేని ఒకరిద్దరు నేతలకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఎరవేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వారి నుంచి స్పందన వచ్చే వరకు రెండోజాబితాను విడుదల చేయకూడదని నిర్ణయించినట్టు సమాచారం.