వెంకటాపూర్, జూన్25: ఎంపీడీవోను కాంగ్రెస్ నాయకులు కారులో వెంబడించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వెంకటాపూర్ మండలంలోని పెద్దాపురం గ్రామానికి తన బైక్పై వెళ్లి వస్తుండగా బూర్గుపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు దుగ్యాల రాజు, ఎర్రబెల్లి భీమ్రావు కారులో వస్తూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు.
బండి అపురా.. అంటూ వెంబడించారు. గతంలో దుగ్యాల రాజు మరుగుదొడ్ల బిల్లులు చేయాలని తన కార్యాలయానికి వచ్చాడు. నిబంధనల ప్రకారం చేసిన బిల్లులను పట్టుకొని రావాలని సూచించాను. దానిని దృష్టిలో పెట్టుకొని తనపై కక్ష పెంచుకున్న దుగ్యాల రాజు.. భీమ్రావు, మరికొంత మందితో కారులో వస్తూ.. స్కూటీపై వస్తున్న తనను వెంబడించారు. స్కూటీని ఢీకొట్టే యత్నం చేయగా బండి వేగాన్ని పెంచి తప్పించుకుంటూ నల్లగుంట వరకు వచ్చాను. కారులో వచ్చిన వ్యక్తులు మద్యం తాగి ఉన్నారని, తనపై జరిగిన దాడి విషయమై వెంకటాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఎంపీడీవో శ్రీనివాస్ వివరించారు.