Thorrur | తొర్రూరు, ఫిబ్రవరి 16: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి తొర్రూరుకు చేరుకున్నారు. అయితే, అన్నారం రోడ్డు వద్ద ఆయనను పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేయగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలుపడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. భారత పౌరసత్వం లేని వ్యక్తిని కార్యాలయంలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ, స్థానిక ప్రజాప్రతినిధిగా సేవలందించిన మాజీ మంత్రి దయాకర్రావును అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు ఝాన్సీరెడ్డిని అకడి నుంచి పంపించారు. అనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకునే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
ఒకే ఓటును రెండుచోట్ల వినియోగించొద్దని అంటూ ఖమ్మంవరంగల్ జాతీయ రహదారిపై కారుకు అడ్డంగా బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ లాఠీచార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టి, ఎంపీని అనుమతించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో దయాకర్రావు పీఏ భాసర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఆయనను రక్షించారు. విషయం తెలుసుకున్న దయాకర్రావు మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.