Koheda Congress Leader | తుర్కయంజాల్, జూన్ 6: ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వారికి మద్దుతుగా నిలిచిన కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అరెస్టు చేయించారు.
కోహెడ పండ్ల మార్కెట్ భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కొంతకాలంగా ఆందోళన చేపట్టారు. కోహెడ మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధనరాజ్, బండారు బాలరాజ్లు ఈ ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్కు శంకస్థాపన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారు సెల్ఫీ వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
congress leaders arrested for support koheda fruit maket victim farmers protest
రైతులకు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ నాయకులమని కూడా చూడకుండా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి తమను అరెస్టు చేయించారని వారు ఆ వీడియోలో ఆరోపించారు. రైతుల హక్కుల కోసం, భూ బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ శాంతియుతంగా మద్దతు తెలుపుతుంటే అరెస్టులకు పాల్పడటం దురదృష్టకరమని విమర్శించారు. కోహెడలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, వారిని ఆదుకోవాల్సిందిపోయి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేయడ సరైనది కాదని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడ్డ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలను ఎదుర్కొంటామని అన్నారు. భూ బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.