Teenmar Mallanna | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచినా అమ్ముడుపోయేది కాంగ్రెస్ నేతలేనని నెటిజన్లు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అవాక్కయ్యారు. ఆయనకు చెందిన ఓ యూట్యూబ్ చానల్లో తీన్మార్ మల్లన్న తాజాగా ఒక పోల్ నిర్వహించారు.
‘ఈ కింది పార్టీల్లో గెలిచిన తర్వాత అమ్ముడుపోయే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు?’ అన్న ప్రశ్నకు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు అనే ఆప్షన్లు ఇచ్చారు. దీనికి సుమారు 2 వేల మంది నెటిజన్లు ఓటేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారంటూ 67 శాతం మంది ఓటేయడం గమనార్హం. బీజేపీ నేతలంటూ అంటూ 15 శాతం మంది తేల్చిచెప్పారు. ఈ ఫలితాలు చూసిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న అవాక్కయ్యారు. కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోతారనే భావన ప్రజల్లో బలంగా ఉన్నదని ఒప్పుకున్నారు. అయితే ఈసారి అమ్ముడుపోరని, బీఆర్ఎస్ నేతలే అమ్ముడుపోతారంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీన్మార్ మల్లన్నను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.