Bodhan | బోధన్, నవంబర్ 22: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. ఈ సారి ఏకంగా బోధన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్పై దాడికి దిగింది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ కార్యకర్తలు కూడా తోడవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో షకీల్ బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఏఆర్పీ క్యాంప్, బ్రహ్మణ్పల్లి, జైతాపూర్లో ఆయన్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో జైతాపూర్లో ఎడపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు డీ శ్రీరామ్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు.
అప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగానే ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయా గ్రామాల్లో గొడవలు సృష్టించిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సాటాపూర్ గేట్ వద్దకు చేరుకుని పథకం ప్రకారం అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపర్చారు. ఈలోగా అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే షకీల్ వాహనంపైనా దాడి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ నాయకులు, వారి గూండాలు తనపై రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడిచేసేందుకు వచ్చారంటూ, తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని షకీల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాంగ్రెస్ దాడిలో బీఆర్ఎస్కు చెందిన ఎడపల్లఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎడపల్లి వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, మోసీన్, మహబూబ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బోధన్లోని ప్రభుత్వ జిల్లా దవాఖానకు తరలించారు. బాధితులను షకీల్ పరామర్శించారు.
తనను పథకం ప్రకారం హత్య చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారని, అదృష్టవశాత్తు ఆ కుట్ర నుంచి బయటపడ్డానని షకీల్ అన్నారు. బుధవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డి ఓడిపోతున్నట్టు తెలిసి, నిరాశ, నిస్పృహతో తనపై, తన అనుచరులపైనా విచక్షణారహితంగా దాడులు చేసేలా కాంగ్రెస్ నాయకులను ఉసిగొల్పారని విమర్శించారు. శరత్రెడ్డితోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకుడు పులి శ్రీనివాస్, జైతాపూర్ సర్పంచ్ రామగోపాల్రెడ్డి, ఆ గ్రామానికి చెందిన నారాయణ, బోధన్కు చెందిన కౌన్సిలర్ మీర్ నజీర్ అలీ తదితరులు ఈ దాడులకు పాల్పడ్డినట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు కొందరు బీజేపీ నాయకులు తోడైనట్టు ఆయన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.