Congress Free Power | హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): అనుకొన్నదే నిజమైంది. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలైనా చెప్తుందన్న వాస్తవం మరోసారి రుజువైంది. పోలింగ్కు ముందు ఉచిత విద్యుత్తుపై మెలికలు పెట్టడం మొదలైంది. కర్ణాటకలో ఓట్లు వేయించుకొని కన్నడిగులను ఎలా అయితే ముంచిందో.. అదే రీతిలో తెలంగాణలోనూ చేయబోతున్నట్టు ఆ పార్టీ నేతే నోరు జారారు. తాము అధికారంలోకి వస్తే గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు (గృహజ్యోతి) ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉచిత విద్యుత్తు కావాలంటే ఇంట్లో ఒక్కటే కరెంటు బుగ్గ ఉండాలని, ఒక్కటే ఫ్యాన్ ఉండాలని, ఒక్కటే టీవీ ఉండాలని కాంగ్రెస్ నేత మహమ్మద్ షబ్బీర్ అలీ తాజాగా ప్రకటించారు. అచ్ఛం కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఇదే పని చేసింది. కాకపోతే అక్కడ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను ఎగిరి తన్నింది. ఇప్పుడు అనుకోకుండా ఆ పార్టీ రహస్యాన్ని ముందుగానే బయటపెట్టేశారు. ఉచితం అంటే ఉచితం కాదని, షరతులు వర్తిస్తాయని సెలవిచ్చారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ…‘ఒక ట్యూబ్లైట్, ఒక బల్బు, ఒక ఫ్యాన్, ఒక టీవీ.. ఇంతవరకైతే ఫ్రీ కరెంట్ ఇస్తాం’ అని ప్రకటించారు. అదే నిజమైతే ఉచిత కరెంటు దేవుడెరుగు.. ఉన్న కరెంటు కూడా పోతది. కర్ణాటక మాదిరిగానే కరెంటు బిల్లుల మోతతో తెలంగాణ ప్రజల నడ్డి విరుగతది.
ఇలా అయితే ఎవరికైనా వర్తిస్తదా..?
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇందులో అమలు చేయబోయే షరతులను మాత్రం దాచిపెట్టింది. ఇప్పుడు ఆ షరతులను షబ్బీర్ అలీ బయటపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇంటిలో అయినా ఒకటే బల్బు, ఒకటే ఫ్యాన్ ఉండటం అసాధ్యం. సింగిల్ బెడ్రూం ఇంట్లో అయినా కనీసం మూడు లైట్లు ఉంటాయి. రెండు ఫ్యాన్లు ఉంటాయి. ఇక టీవీ, ఫ్రిజ్ కూడా సాధారణమే. ఇవి లేని కుటుంబాలు ఒకటిరెండు శాతం కూడా ఉండవు. ఈ లెక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న గృహజ్యోతి పథకం ఏ ఇంటికీ వర్తించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్తూ.. ఇలా కండిషన్లు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీది పచ్చి మోసం అని ప్రజలు మండిపడుతున్నారు.
వ్యవసాయం చేయలేం
3 గంటల కరెంట్తో వ్యవసాయం చేయలేం. ఇప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. 5 హెచ్పీ మోటర్లు పెట్టుకొని, మంచిగా పంటలు పండించుకుంటున్నాం. అట్లకాదని 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొని, 3 గంటల కరెంట్తో పంటలు పండించుకోలేం. 10 హెచ్పీ మోటర్తో ట్రాన్స్ఫారంపై లోడ్ పడుతుంది. స్టార్టర్లు, మోటార్లు కాలిపోతాయి. దానికి పెద్ద రూటర్, పెద్ద షాఫ్ట్ ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చి బయటకు తీయాలంటే కూడా ఇబ్బందే. 3 గంటల కరెంట్, 10 హెచ్పీ మోటార్లతో వ్యవసాయం జరుగదు. ఇచ్చినా మాకు వద్దు. ఇది రైతులకే కాదు ప్రభుత్వానికీ భారమే. – ఇంద్రసేనారెడ్డి, రైతు -కేశవరం, మేడ్చల్ జిల్లా