హైదరాబాద్ : సంగారెడ్డిలో జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఐటీ ఐదరాబాద్లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమానికి భట్టి హాజరయ్యారు. అయితే సంగారెడ్డి జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ముందుండే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సదరు మీటింగ్కు డుమ్మా కొట్టడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి మీటింగ్కు హాజరు కాకపోవడంపై ఆ పార్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. హైదరాబాద్ ఐఐటీలో ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్తో (IIT Hyderabad)సింగరేణి ఒప్పందం చేసుకున్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు.
అయితే ఈ ప్రోగ్రామ్కు జగ్గారెడ్డి మాత్రం అటెండ్ కాలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాఫిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ముమ్మరమయ్యాయని, సీఎం పదవి కోసం భట్టితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు అంతర్గతంగా కొద్ది రోజుల నుంచి పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన జగ్గారెడ్డి అందుకే సదరు కార్యక్రమానికి హాజరు కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు రెండో పవర్ సెంటర్గా ఎవరు ఉండొద్దనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే జగ్గారెడ్డిని అటెండ్ కాకుండా అడ్డుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుముందు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోనని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.