కృష్ణకాలనీ, ఏప్రిల్ 14: అంబేదర్ జయంతి వేడుకలకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా..? అని కాంగ్రెస్ నేత చల్లూరి మధు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అంబేదర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం సక్రమంగా అమలైతే సత్తన్న (ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు) సీఎం అయ్యేవారని పేర్కొనడంతో అకడున్న ప్రజలు అవాక్కయ్యారు. భూపాలపల్లి కాంగ్రెసోళ్లకు రేవంత్రెడ్డి సీఎం అవ్వడం ఇష్టంలేదా..? లేక రాష్ట్రంలోని ఎమ్మెల్యేల మధ్య వర్గాలు మొదలయ్యాయా..? అంటూ గుసగుసలాడారు.
అంబేదర్ రాజ్యాంగం గొప్పతనాన్ని అన్ని వర్గాల ప్రజలకు తెలియజేద్దామంటే… పిల్లలను వేడుకలకు పిలువడమేమిటని అధికారులపై మండిపడ్డారు. అంబేదర్ జయంతి వేడుకలకు సబ్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు ఖర్చుపెట్టి 500 మందికి భోజనాలు పెట్టే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యే సత్తన్న, కలెక్టర్, ఎస్పీ, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ అభివృద్ధి అధికారులు అంబేదర్పై చిన్నచూపు చూడకుండా వేడుకలు ఘనంగా నిర్వహించండి.. లేదంటే ఆ బాధ్యతను నాకివ్వండి.. భూపాలపల్లి జిల్లాలో 90 వేల మంది దళితులమున్నాం.. తలో రూపాయి వేసుకొని అంబేదర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటాం’ అనడం అధికారులు, ప్రజల్లో చర్చనీయాంశమైంది.
అంబేద్కర్ ఆశయాలకు బీజేపీ తూట్లు : వీఎస్ నిర్మల్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయాలకు కేంద్రం, బీజేపీ తూట్లు పొడుస్తున్నాయని ఆలిండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీఎస్ నిర్మల్ విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేయడానికి కేంద్రప్రభుత్వం పూనుకున్నదని ఆరోపించారు. మంగళవారం అంబేదర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.