Congress | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ఎక్కడా అనలేదని ఇటీవల ఖండించిన కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.. సన్న వడ్లకు బోనస్ ఇస్తే తప్పేమిటని తాజాగా ప్రశ్నించారు. గాంధీభవన్లో మంగళవారం మీడియా తో మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం ఎవరూ తినరు కాబట్టి సన్న వడ్లకు బోనస్ ఇస్తామంటే తప్పు ఎలా అవుతుందని ఎదురుదాడికి దిగారు. ఈ రోజుల్లో గ్రామాల్లో ఎవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా? అని ప్రశ్నించారు. దొడ్డు వడ్లు కేవలం పశువులకు మేతకు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ధాన్యానికి మద్దతు ధర తోపాటు బోనస్ ఇస్తామని తమ పార్టీ చెప్పిన మాట వాస్తవమేనంటూ అంగీకరించారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల మీడియా చిట్చాట్లో సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ముందు వడ్లు పండించే రైతులందరికీ బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సన్న వడ్లకే ఇస్తామని చెప్పడంపై రెండు రోజుల కిందట గాంధీభవన్లో పాత్రికేయులు ప్రశ్నించినప్పు డు.. సీఎం ఆ మాట ఎక్కడా చెప్పలేదని కోదండరెడ్డి ఖండించారు. ఇదే అంశంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ కూడా స్పందిస్తూ సీఎం అనని మాటలను అన్నట్టుగా మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు.
సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. దీంతో మొన్నటి దాకా అలా చెప్పలేదని ఖండిస్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు తాజాగా సన్న వడ్లకు బోనస్ ఇస్తే తప్పేంటని అంటూ వాదనకు దిగారు. రుణ మాఫీ విషయంలోనూ ఇలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 కల్లా రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేసి తీరుతాం, ఎవరైనా రైతులు రుణం తీసుకోకపోతే తీసుకోండని చెప్పిన రేవంత్రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సంగతి తెలిసిందే..