Congress | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న భారీ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నది. దీనికి రాజీవ్గాంధీ ప్రాంగణంగా, జనజాతర సభగా ఆ పార్టీ నామకరణం చేసింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని జన సమీకరణ, ఏర్పాట్లను స్వ యంగా పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టోను ఇదే సభా వేదికపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ విడుదల చేస్తారని పీపీసీ పేర్కొన్నది.
ఈ సభకు 10 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు ప్లాన్ చేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి న సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే శంఖారావం పూరిస్తున్నట్టు పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేయడంతోపాటు 70 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం ఏఐసీసీ రూపొందించిన మ్యానిఫెస్టోలో ‘పాంచ్ న్యాయ్.. ప చ్చీస్ గ్యారెంటీ’ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు ఇస్తున్నట్టు పీసీసీ పేర్కొన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వందరోజుల పాలన విజయాలతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై సభలో పార్టీ ప్రకటిస్తుందని పేర్కొన్నారు.