హైదరాబాద్, నవంబర్ 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని బయటపెట్టారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే రూ.2 లక్షల వరకు రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణమాఫీ చేయకపోతే సీఎంను మార్చేస్తామని నమ్మించారన్నారు.
15 నెలల వరకు రైతు రుణమాఫీ గురించి పట్టించుకోలేదన్నారు. ఒత్తిడి రావడంతో చేసేది లేక కాంగ్రెస్ ప్రభుత్వం 26 లక్షల నకిలీ రుణమాఫీ పత్రాలను రైతులకు ఇచ్చిందన్నారు. వాటి వల్ల రైతులకు ఒక రూపాయి కూడా ఉపశమనం కలగలేదన్నారు. అప్పట్లో తాను కాంగ్రెస్లోనే ఉండటంతో ఆ పాపంలో తనను కూడా భాగస్వామిని చేసిందన్నారు. అందుకే తాను ఆ పార్టీని వీడానన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ల గురించి తన కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదన్నారు. 20 ఏళ్లపాటు వారితో సహవాసం చేయడంతో వారి మోసాలు తనకు బాగా తెలుస న్నారు. కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ రోగాల ప్రదేశ్గా ఉండేదని, రోడ్లన్నీ గుంతలతో ఉండేవని అన్నారు. విద్యుత్తు కోతలతో, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు ఉండేవి కాదని చెప్పారు. అప్పట్లో రాష్ట్రంలో 15 నెలలపాటు కోతలు, కమీషన్లు, అవినీతి ప్రభుత్వం ఉందన్నారు. కమల్నాథ్, దిగ్విజయ సింగ్లను జై-వీరు అని అభివర్ణిస్తున్నారని, ‘షోలే’ సినిమాలో జై, వీరు దొంగతనాలు, మోసాలు చేస్తూ ఉంటారని గుర్తు చేశారు.