హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా అత్యధిక నియోజకవర్గాల్లో సమర్థులైన, గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది. దరఖాస్తు చేసుకున్నవారిలో సగానికిపైగా నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్నవారే లేక అధిష్ఠానం తలపట్టుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రక్రియ ప్రారంభించి దాదాపు రెండు నెలలు అవుతున్నది.
అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీకి అప్పగించింది. ఈ రెండు కమిటీలు భేటీలపై భేటీలు జరుపుతున్నా అభ్యర్థుల జాబితా కొలిక్కిరావడం లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మూడుసార్లు, స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్లో రెండుసార్లు, ఢిల్లీలో మరో రెండుసార్లు భేటీ అయింది. కానీ అడుగు ముందుకు పడటం లేదు. కమిటీల భేటీల్లో నేతల మధ్య పంచాయితీకే సరిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కనీసం శుక్రవారం జరిగే స్క్రీనింగ్ సమావేశంలో అయినా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 30-35 సీట్లలో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఇంకా సుమారు 85-90 సీట్లలో అభ్యర్థుల ఎంపికకు ఆపసోపాలు పడుతున్నది. ఆయా నియోజకవర్గాలకు ఇద్దరు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నా గట్టి అభ్యర్థులు లేరనే టాక్ వినిపిస్తున్నది.