హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ):/రవీంద్రభారతి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ దగా అని తాజా బడ్జెట్తో మరోసారి తేలిపోయిందని పలువురు బీసీ సాహితీవేత్తలు ధ్వజమెత్తారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నిప్పులు చెరిగారు. ఆధిపత్య వర్గాల చేతుల్లో దారుణంగా మోసపోతున్న బీసీలకు బీసీ కవులు, రచయితలు అండగా నిలవాలని, విస్తృతంగా సాహిత్య సృష్టికి చొరవ చూపాలని పిలుపునిచ్చారు. బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్ రవీంద్రభారతిలో బీసీ కులవృత్తుల దీర్ఘ కవితల సదస్సు ఆదివారం జరిగింది.
ఈ సదస్సులో పలువురు బీసీ కవులు, రచయితలు పాలుపంచుకొన్నారు. కార్యక్రమంలో బహుజన ఉద్యమ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను కాంగ్రెస్ అత్యంత దారుణంగా మోసగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం చేస్తామని బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెకిన వాళ్లను నిలదీసేందుకు బీసీ బుద్ధి జీవులు కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఇది బీసీల విముక్తి సమయమని, బీసీ యుగమని, ఐక్యంగా కదిలితేనే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని వెల్లడించారు. బీసీల్లో కదలిక వచ్చిందని, దాన్ని సామూహిక శక్తిగా మార్చే బలం బీసీ సాహిత్యకారులు, బీసీ బుద్ధి జీవులపైనే ఉన్నదని చెప్పారు. కలుషిత ఆహారం తిని భావిభారత బడుగుల బిడ్డలు రాలిపోతుంటే బీసీ సాహిత్యకారులు చూస్తూ ఊరుకోవద్దని, బీసీ బిడ్డల్ని చంపే పాలకుల దుర్నీతిని రచయితలు బయట పెట్టాలని కోరారు. ఇప్పుడు జరగాల్సింది వర్ణ పోరాటమని, తెలంగాణ నేల ఇచ్చిన పోరాట స్ఫూర్తితో వర్ణ పోరాటం వైపునకు నడిపించే సాహిత్యపు ఆట, మాట, పాటలు రావాలని ఆకాంక్షించారు.
డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన కొనసాగిన ఈ తొలి సమావేశానికి బీసీ కవులు, రచయితలు, సాహితీవేత్తలు భారీగా తరలివచ్చారు. కాళోజీ తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, కవి కందుకూరి శ్రీరాములు, బహుళ మహిళా పక్షపత్రిక సంపాదకురాలు జ్వలిత, కవయిత్రి తిరునగరి దేవికీదేవి ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. బీసీ దీర్ఘ కవితలపై డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు, బూర్ల వెంకటేశ్వర్లు,
డాక్టర్ ఎంవీ రమణ, డాక్టర్ కస్ప నరేందర్, రెండో సదస్సులో కాళోజీ అవార్డు గ్రహీత శ్రీరామోజు హరగోపాల్, కవి బెల్లి యాదయ్య, నాళేశ్వరం శంకరం, కంచర్ల మహేశ్, డాక్టర్ బండారి రాజ్కుమార్, తూర్పింటి నరేశ్, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ తుండు కృష్ణకౌండిన్య దీర్ఘకావ్యాలపై ప్రసగించారు. ముగింపు సదస్సులో బీసీ సాహిత్య వేదిక కన్వీనర్ వనపట్ల సుబ్బయ్య, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారాం, బీసీ రచయితల సమాఖ్య అధ్యక్షుడు గాజోజి నాగభూషణం, డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్, డాక్టర్ భీంపలి ్లశ్రీకాంత్తోపాటు, చికొండ్ర రవి, రాము వివిధ జిల్లాల నుంచి వచ్చిన సాహిత్యకారులు, కవులు పరిశోధకులు తమ కవితలు వినిపించారు.
హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని, బడ్జెట్ ప్రతిపాదనలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, బడ్జెట్లో బీసీలకు చేసిన అన్యాయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీ మేధావులు, ప్రముఖులు భారీగా తరలివచ్చి అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు.