హైదరాబాద్: నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 (Group-2) పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. అయితే గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ విషయం నిర్ణయం తీసుకున్నదని, నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీని సెప్టెంబర్లో నిర్వహించాలని గతకొంతకాలంగా డిమాండ్ చేస్తూవస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో.. డీఎస్సీ వాయిదా, గ్రూప్-1 మెయిన్స్తోపాటు పలు సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు శుక్రవారం టీఎస్పీఎస్సీ ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో పరీక్షల వాయిదా అంశంపై చర్చించినట్టు తెలిసింది. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది.