Crop Loans | బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు.
– ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలు.
మంచిర్యాల, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రాప్లోన్లు తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాట.. రుణమాఫీ ఇగ చేస్తం.. అగ చేస్తం..అంటూ రైతులను ఆగమాగం చేసింది. ముహూర్తం పెట్టినం.. మార్చి 15 నుంచి చేస్తం.. అని పూటకో మాట చెప్తూ కాలం వెళ్లదీసింది. వందరోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి.. వంద రోజులు దాటినా చడీచప్పుడు లేదు. తాజాగా రుణమాఫీ సంగతి దేవుడెరుగు.. తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు లీగల్ నోటీసులు వస్తున్నాయి. నోటీసులు అందుకున్న రైతులు కాంగ్రెసోళ్ల మాటలన్నీ నీటి మూటలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాఫీ చేస్తమన్న సర్కారు మౌనంగా ఉండడంపై గిదేం పోయేకాలం అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.
రుణమాఫీపై వివరాలే అడగలేదట..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా తీసుకోలేదని సంబంధిత శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. రుణమాఫీ చేసే ఉద్దేశముంటే కనీసం వివరాలు తీసుకోవాలి కదా.. మమ్ములనైతే అడగలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ జిల్లా స్థాయి అధికారి ‘నమస్తే తెలంగాణ’తో బాహాటంగానే అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే అసలు రూ.2 లక్షల రుణమాఫీకి కసరత్తు జరిగిందా.. లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైపెచ్చు లీగల్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందిస్తూ.. ‘తీసుకున్న రుణాలు తిరిగి కట్టకపోతే లీగల్ నోటీసులు ఇవ్వకపోతే ఏం చేస్తాం. బ్యాంక్ మేనేజర్లపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది కదా. అందుకని నోటీసులు ఇవ్వక తప్పదు’ అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చారా అంటే.. అప్పుడు బ్యాంకర్లకు ముందస్తు ఆదేశాలు ఉండడంతో అందరూ రైతులకు సహకరించేవారిని& కానీ ఇప్పుడు కమ్యూనినేషన్ గ్యాప్తో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సదరు అధికారి వివరించారు.
ఈ రైతు పేరు పగడపల్లి నాగభూషణ్. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన ఈ రైతుకు లాయర్ నుంచి బ్యాంక్ మేనేజర్ లీగల్ నోటీసు పంపారు. మార్చి 3, 2024 నాటికి రూ.2,32, 876.56లతో పాటు వడ్డీ కలుపుకొని రూ.2,76,876.56 కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. పైగా మార్చి 4, 2024 నుంచి మళ్లీ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా మొత్తం డబ్బులు కట్టాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతు నాగభూషణ్ ఆందోళన చెందుతున్నారు.
ఎక్కడికెళ్లి తేవాలే.. చావాల్నా
నాకు 66 యేండ్లుంటయి. గుంట తక్కువ రెండెకరాలుంది. దాని మీద 2017లో రూ. లక్ష లోన్ తీసుకున్న. 2020లో ఆ లోన్ రూ.1.60 లక్షలకు రెన్యూవల్ అయింది. ఆ తర్వాత ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన. వయసు మీద పడ్డది. సాతనైతలేదు. ఎవుసానికి పోని పరిస్థితి. పొలం కౌలుకిస్తున్నా. వాళ్లిచ్చే బియ్యంతోనే తిండికి గడుపుతున్నా. ఈ లోన్ పైసలు యాడికెళ్లి తేవాలే.. ఆత్మహత్య చేసుకోవాల్నా. రేవంత్రెడ్డి రూ.2 లక్షలు మాఫీ చేస్తాడని ఎదురు చూస్తున్నం. ఇంతల్నే బ్యాంకోళ్లు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నరు. నేనైతే ఏం చేయలేని పరిస్థితి. మా నోట్ల మన్ను కొట్టొద్దు. మమ్ములను ఆగం చేయొద్దని రెండు చేతులెత్తి బ్యాంకు సార్లకు దండం పెడుతున్న.
– నాగభూషణ్, రైతు, లక్ష్మణచందా, పగడపల్లి (మ), నిర్మల్ జిల్లా