కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది.
వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈ నెల 9వ తేదీన హరీశ్రావు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అకస్మా్త్తుగా గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.
హరీశ్రావు సభకు అనుమతులు రద్దు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామని తెలిపారు. ప్రజలు, రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని తెలిపారు. తాము కేసులు, బెదిరింపులకు భయపడితే ఈ తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు.